Saturday, 17 December 2016

సమష్టిగా లక్ష్యం చేరుకుందాం పేటను నగదు రహితంగా మారుద్దాం సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు కేటాయించారు అధికారులు, బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

సమష్టిగా లక్ష్యం చేరుకుందాం 
పేటను నగదు రహితంగా మారుద్దాం 
సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు కేటాయించారు 
అధికారులు, బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

న్యూస్‌టుడే-సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో నమూనాగా చేపట్టిన నగదు రహిత లావాదేవీల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. సిద్దిపేట శివారులోని బైరి అంజయ్య గార్డెన్‌లో నగదురహిత లావాదేవీల అమలు ఎంత మేర వచ్చింది..? ఏం సమస్యలున్నాయి...వాటిని అధిగమించడం ఎలా..? అనే అంశంపై శుక్రవారం బ్యాంకింగ్‌ అధికారులు, వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన ఈ క్రతువులో ఎక్కడ లోపం తలెత్తినా లక్ష్యానికి ఆటంకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 కోట్లు నియోజకవర్గానికి కేటాయించారన్నారు. కొత్త ఖాతాలు తెరవడంతో పాటు కార్డులు లేనివారికి వెంటనే అందించాలని.. ఇక వ్యాపారులు, సంస్థలకు డిమాండ్‌కు అనుగుణంగా స్వైపింగ్‌ యంత్రాలు జారీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.అదనపు సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. ఎస్‌బీహెచ్‌, ఎస్‌బీఐలు ఇన్‌ఆపరేటీవ్‌ ఖాతాలను వారంరోజుల్లో యాక్టివేట్‌ చేసి రూపే కార్డులు జారీ చేయనున్నారని వివరించారు.మిగతా బ్యాంకులు ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-లావాదేవీల పర్యవేక్షణకు ప్రతి బ్యాంకు ఒక సీనియర్‌ అధికారిని కేటాయించాలి. ప్రతివారం ప్రగతి తీరు సమీక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్‌ మాట్లాడుతూ నగదురహిత ఉద్యమంలో అంతా బాగా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా చొరవచూపుతున్నారని అభినందించారు. ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్గించాలన్నారు. కలెక్టర్‌ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ...నియోజకవర్గంలోని 75 గ్రామపంచాయతీలు, 34 వార్డులను నగదురహితం చేసేందుకు చేపట్టిన ప్రక్రియ చురుగ్గా సాగుతోందన్నారు. ఈపాటికే 26 వేల మందికి అవగాహన కల్పించాం. 70-80 వేల ఖాతాలు ప్రారంభం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కె.రవీందర్‌రావు మాట్లాడుతూ...సహకార బ్యాంకులు, సంఘాల్లో ఖాతాలు, రూపేకార్డులు వేగంగా జారీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ ప్రసంగిస్తూ సిద్దిపేట దేశానికి ఆదర్శం కాబోతుందనీ, బ్యాంకర్లు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.మెప్మా ద్వారా ఈ-లావాదేవీలు ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ...నగదురహిత ఆవశ్యకతను బ్యాంకర్లు గుర్తించి సహకరించాలన్నారు.పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ నదీంఅహ్మద్‌, ఆంధ్రా బ్యాంకు సీజీఎం సత్యనారాయణ మూర్తి, ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ గిరిధర్‌, ఎస్‌బీహెచ్‌ జీఎంలు రాజీవ్‌శర్మ, త్యాగరాజన్‌, వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌ రేవతి రోహిణి, సీపీ శివకుమార్‌, జేసీ హనుమంతరావు, డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అడుగుల లెక్క.. ఆరోగ్యం పక్కా.. నడకకూ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రణాళికాబద్ధంగా సాగితే ప్రయోజనం ఈనాడు, హైదరాబాద్‌


అడుగుల లెక్క.. ఆరోగ్యం పక్కా.. 
నడకకూ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం 
ప్రణాళికాబద్ధంగా సాగితే ప్రయోజనం 

ఈనాడు, హైదరాబాద్‌

జీవితం ఆరోగ్యంగా ఉత్సాహంగా సాగాలంటే నిత్యం 10 వేల అడుగులు పడాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. ఉదయం నిద్ర లేవగానే నడకకు వెళ్లడం కొందరికి అలవాటుగా ఉంటుంది. మరి కొందరు మాత్రం ఒకరోజు వెళితే మరోరోజు బద్ధకిస్తుంటారు. ఇలాంటి వారు సాంకేతికతకు చేరువైతే నిత్యం ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందువల్లనే ఇటీవల నిత్యం నడకకు వెళ్లే వారు తాము ఎన్ని అడుగులు వేస్తున్నాం..ఎంత దూరం నడుస్తున్నాం.. ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చవుతోందన్న లెక్కలు పెట్టుకుంటూ నడుస్తున్నారు.
లక్ష్యం ఉంటేనే.. 
నిత్యం నడవడం..లేదా వ్యాయామం చేయడం క్రమం తప్పకుండా కొనసాగాలంటే ఒక లక్ష్యం ఉంటేనే సాధ్యమవుతుంది. కచ్చితంగా రోజూ పది వేల అడుగులు వేస్తే గుండె సంబంధిత వ్యాధులు చాలా వరకు దూరమవుతాయని ప్రముఖ వైద్యులంతా వివిధ సందర్భాల్లో చెబుతున్నారు. ఈ విషయమై అవగాహన పెరుగుతుండటంతో రోజూ నడకకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. కాలనీల్లోని చిన్నపాటి పార్కులకూ నడకకు.. వ్యాయామాలకూ వచ్చే వారి సంఖ్య ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలా ఎక్కువని వాటి నిర్వాహకులు వివరిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు చాలామంది లక్ష్యం మేరకు (రోజుకి 10వేల అడుగులు) నడిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నారు. ఉదయం వేళ నడుస్తున్నప్పుడు ఏడు వేల అడుగులు పూర్తి చేస్తే రాత్రి నిద్రకు ఉపక్రమించేలోగా మిగిలిన మూడు వేల అడుగులు పడేలా చూసుకొంటున్నారు. ఇందుకోసం పెడోమీటర్లు లాంటివి ధరిస్తూ వస్తున్నారు. కొందరు వీటిని కొనుగోలు చేస్తుంటే అత్యధికులు చరవాణినే ఇందుకు వినియోగిస్తున్నారు.


యాప్‌ సాయంతో.. 
చరవాణి ఇప్పుడు కేవలం మాట్లాడుకోవడానికి... సంక్షిప్త సందేశాలు పంపుకోవడానికే కాకుండా... ఇతరత్రా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లు జీవన విధానాన్నే మార్చేసే దశకు చేరాయి. ఆరోగ్యానికి సంబంధించి అనేక యాప్‌లు సేవలు అందిస్తున్నాయి. నడక విషయంలోనూ పెడోమీటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉచితంగానే ఈ సేవలు లభిస్తుంటాయి. ఇందులో మనం వేసే ప్రతి అడుగు లెక్కా కనిపిస్తుంది. ఉదయం మంచం దిగి కాలు కింద పెట్టినప్పటి నుంచి వేసే ప్రతి అడుగూ నమోదవుతుంది. ఎంత వేగంగా నడుస్తున్నామో కూడా తెలిసిపోతుంది. ఉదయం నడక ప్రారంభించిన తరవాత ఎంత సేపటిలో ఎన్ని అడుగులు వేశాం..ఎన్ని కి.మి. నడిచామనే లెక్క ఈ యాప్‌ చెబుతుంది. నడవడం వల్ల ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చయిందో ఎప్పటికప్పుడు గమనిస్తూ అడుగులు వేయవచ్చు. ఇలా చూసుకోవడానికి అలవాటు పడితే ఇక నడకకు బద్ధకించడం అనే ప్రసక్తే ఉండదని వీటిని వినియోగిస్తున్న వారు అంటున్నారు. ఒకవేళ ఒకరోజు ఉదయం తక్కువ అడుగులే వేసినా.. ఆ లెక్క మన చరవాణిలోనే కనిపిస్తుండటంతో సాయంత్రంలోగా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మిగిలిన అడుగులు వేయించేవిధంగా ఇవి ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. అందుకే ఇప్పటి వరకు మీ చరవాణిలో ఈ యాప్‌ లేకుండా వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

నిత్యం సాగాలంటే.. 
నలుగురితో కలిసి ఒక నిర్దిష్ట సమయంలో నడవండి.. 
నడిచేప్పుడు ఇతరులతో వాదోపవాదాలకు తావిచ్చే విషయాలపై చర్చించకుండా సరదా కబుర్లతో సాగితే బాగుంటుంది. 
చుట్టూ పచ్చదనం ఉండే ప్రాంతాల్లో.. ప్రకృతిని ఆస్వాదిస్తూ నడిస్తే మనసుకు ఉల్లాసం కలుగుతుంది. 
నడకకు ఒక లక్ష్యం పెట్టుకుంటే అంతరాయాలను అధిగమించవచ్చు.